విమాన ప్రయాణీకులకు శుభవార్త | 32 Airports Available for civil Aircraft operations | Sakshi
Sakshi News home page

విమాన ప్రయాణీకులకు శుభవార్త

May 12 2025 12:17 PM | Updated on May 12 2025 1:58 PM

32 Airports Available for civil Aircraft operations

ఢిల్లీ: దేశంలోని 32 విమానాశ్రయాల మూసివేత అంశంపై భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) కీలక ప్రకటన చేసింది. కొన్ని రోజులుగా మూసివేసిన 32 విమానాశ్రయాలను నేడు తిరిగి తెరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు విమానయాన కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ సంబంధిత అధికారులు నోటీస్ టు ఎయిర్‌మెన్ (NOTAM) జారీ చేశారు.

భారత్, పాక్‌ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 32 విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనడంతో కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన విమాన సేవలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. విమానాశ్రయాల్లో విమాన సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ 32 విమానాశ్రయాల నుంచి పౌర విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ఇక, విమానాశ్రయాల పునఃప్రారంభంతో ప్రయాణికులు, విమానయాన సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతుండటంతో ప్రయాణాలకు ఊరట లభించింది. నోటామ్ జారీ చేయడం ద్వారా విమానాల రాకపోకలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పైలట్లకు, ఇతర సిబ్బందికి అధికారికంగా తెలియజేశారు. దీంతో విమానయాన కార్యకలాపాలు సురక్షితంగా, సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

Advertisement
 
Advertisement
Advertisement