నాణ్యమైన వైద్యం అందించాలి..
● ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
ప్రదర్శనను తిలకిస్తున్న కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
నారాయణపేట: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా ఉ ద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యలో ఉద్యా న సాగు.. ఆయిల్పాం విస్తీర్ణం పెంపుపై నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఆయిల్పాం గెలలు, వ్య వసాయానికి వినియోగించే వివిధ రకాల యంత్రాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానశాఖలు అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖమ్మంలో రైతులు ఎక్కువ గా ఆయిల్పాం సాగు చేస్తారని, జిల్లాలో ఆసక్తి గల రైతులను అక్కడకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో చూపించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 206 ఎకరాల్లో ఆయిల్పాం తోటలున్నాయని.. 10 వేల ఎకరాలకు విస్తరిస్తే జిల్లాలోనే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, డీఎంహెచ్ఓ డా. జయచంద్రమోహన్, మండలస్థాయి ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కొత్తపల్లి: పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. మంగళవారం మద్దూరులోని పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రిసెప్షన్, గైనిక్, పిడియాట్రిక్, ల్యాబ్, పురుషుల వార్డు, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, ఇంజెక్షన్ గది, జనరల్ వార్డులను పరిశీలించారు. అనంతరం రోగులతో మా ట్లాడి వైద్యసేవలు సరిగా అందుతున్నాయ లేదా అనే అంశాలను ఆరా తీశారు. వేసవిలో వడదెబ్బ బారిన పడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నారులకు అందించే వైద్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట వైద్యుడు డా. మల్లికార్జున్, పావని ఉన్నారు.


