నారాయణపేట: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను మంగళవారం ఎస్పీ డా. వినీత్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై కలెక్టర్తో ఎస్పీ చర్చించారు. పరస్పర సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని అభిప్రాయపడ్డారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి..
ప్రస్తుత ఆధునిక సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో పాటు సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ డా. వినీత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులమంటూ ఓటీపీ, ఏటీఎం నంబర్లు చెప్పాలని అడుగుతుంటారని, కేవైసీ అప్డేట్, పార్సిల్ డెలివరీ, లాటరీ గెలిచారంటూ లింకులు పంపి క్లిక్ చేయించడంతో ఖాతా వివరాలు దోచుకుంటున్నారని వివరించారు. ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాలను హ్యాక్చేసి ఫ్రెండ్స్ను డబ్బులు అడిగి మోసాలు చేస్తున్నారని.. తక్కువ ధరలతో ఫేక్ వెబ్సైట్లు సృష్టించి డబ్బులు తీసుకొని సరుకులు పంపడం లేదని వివరించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్రైనింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారని, తెలియని వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు రికార్డుచేసి బ్లాక్మెయిల్కు పాల్పడుతారని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్లో టోల్ఫ్రీ నంబర్ 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. జిల్లాలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.


