● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: జిల్లాలోని భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన భూగర్భజలాల వినియోగం–సంరక్షణపై జిల్లా అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో భూగర్భజలాల వివరాలు, లభ్యత, వినియో గం, వర్గీకరణ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సేకరణ, నీటి సంరక్షణ నిర్మాణాలు–నిర్వహణపై కలెక్టర్ సమీక్షించారు. భూగర్భ జల వనరు లశాఖ ఏడీ రవి భూగర్భ జలాల లభ్యత, వినియోగం, మండలాల వారీగా వర్గీకరణ, నీటి ప్రాముఖ్యతను వివరించారు. భూగర్భజల వనరులపై ఆధార పడి వ్యవసాయం చేయడం తగ్గించుకోవాలని.. పరిమితంగా వినియోగించుకోవాలని కోరారు. నీ టిని సృష్టించలేం.. సంరక్షించుకోగలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇష్టారాజ్యంగా భూ గర్భ జలాల్ని వెలికితీయడం కాకుండా వాన నీటిని సాధ్యమైనంత వరకు భూమిలోకి ఇంకింపజేసే విషయంపై దృష్టి సారించాలని, నీటి సంరక్షణ అందరి సామాజిక బాధ్యతని తెలిపారు. అనంతరం కలెక్టర్ జిల్లా క్రియాశీలక భూగర్భ జల వనరులు పుస్తకం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, సీపీఓ ఖాఘవాహన్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, పరిశ్రమలశాఖ జీఎం రామలింగేశ్వరగౌడ్, భూగర్భ జల వనరులశాఖ అధికారులు నరేష్, వెంకన్న పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాలి..
జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్లతో పాటు రెవెన్యూ, వాటర్షెడ్ పరిధిలోని చెక్ డ్యాంల వద్ద నుంచి ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు తప్పనిసరి అని.. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టాల్సిందేనని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ట్ లేవల్ స్యాండ్ కమిటీ) సమావేశం గూగుల్ మీట్ ద్వారా నిర్వహించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జలశాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల, వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇరిగేషన్, జల వనరులశాఖ ఏడీని ప్రశ్నించారు. మాగనూరు మండలంలోని 5 ఇసుక రీచ్లు, ఉట్కూర్ మండలంలో 2, మక్తల్లో రెండు, ధన్వాడలోని గోటూరు, కొత్తపల్లి, లింగాల్చేడ్ రీచ్ల నుంచి ఇసుక రవాణాకు ప్రతిపాదనలు పంపినట్లు మైనింగ్ ఏడీ వివరించారు. గుర్తించిన ప్రాంతాల నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని, ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి, పారదర్శక నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఒకరిద్దరు తహసీల్దార్ల పనితీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గూగుల్ మీట్లో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, మిషన్ భగీరథ ఎస్ఈ రంగారావు, ఇరిగేషన్ అధికారి, ఆయా మండలాల తహసీల్దార్లు, సీఐలు, ఎస్ఐలు, కలెక్టరేట్లోని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


