గట్టు: భారత్మాల ఆరు వరుసల జాతీయ రహదారికి గట్టు ప్రాంత వాసుల వాహనదారులకు కనెక్టివిటీ సౌకర్యం కల్పించాలని గట్టు, రాయాపురం, ఆలూరు, మల్లాపురం గ్రామాల ప్రజలు కోరారు. ఆయా గ్రామాల ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాటికి 57వ రోజుకు చేరుకుంది. మిట్టదొడ్డి, చాగదోన గ్రామాల ప్రజలు వారికి మద్దతు తెలిపారు. రాయాపురం స్టేజీ దగ్గర ఉన్న డబుల్ రోడ్డును మూసి వేయకుండా వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. పాత ఆలూరు రోడ్డులో తక్కువ ఎత్తులో వంతెనను నిర్మించడం వలన భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు ఆరోపించారు. నేషనల్ హైవే అఽథారిటీ అధికారులు స్పందించి గట్టు మండలానికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వడంతో పాటుగా రాయాపురం డబుల్ రోడ్డు దగ్గర వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు రాముడు, ఆప్కో మాజీ డైరెక్టర్ దోమ వీరన్న, మహాదేవప్ప, అమ్మన్న, వీరేష్, వెంకటన్న, గోవిందు, ఆంజనేయులు, కృష్ణయ్య, సాలే కర్రెప్ప,సుధాకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
యువతి అదృశ్యంపై
కేసు నమోదు
వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట గ్రామానికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు. గ్రామానికి చెందిన తోకల మహేశ్వరి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేది. అయితే సోమవారం ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లింది. ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


