42 శాతం రిజర్వేషన్‌ సాధనకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

42 శాతం రిజర్వేషన్‌ సాధనకు పోరాటం

Mar 9 2026 7:12 AM | Updated on Mar 9 2026 7:12 AM

వనపర్తి టౌన్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాటం ఆగదని.. బీసీ సర్పంచ్‌లను ఇబ్బందులు, ఒత్తిడికి గురి చేసినా సహించమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. శనివారం జిల్లాకేంద్రంలో బీసీ సర్పంచులు, ఉప సర్పంచుల సన్మానసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏ కుల రిజర్వేషన్‌లో లేని క్రిమిలేయర్‌ బీసీ రిజర్వేషన్‌లో ఉండటం వివక్షతో అణగదొక్కడమేనని, తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడానికి కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయకపోయినా 60 శాతానికి పైగా గ్రామపంచాయతీలు, పురపాలికల్లో బీసీలే గెలుపొందారని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్‌ సాధించడానికి పెద్దఎత్తున పోరాటాలు చేసేందుకు ప్రతి బీసీ బిడ్డ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంఘం జాతీయ కార్యవర్గ అధ్యక్షుడు అరుణ్‌కు మార్‌, జిల్లా అధ్యక్షుడు అరవింద్‌స్వామి, ధారాసింగ్‌, రమేష్‌, జహంగీర్‌ పాషా, రఘునందన్‌చారి, సతీష్‌, ముకుందనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement