
తాగునీరు సురక్షితమేనా..?
మరికల్: జిల్లాలో సరఫరాలో అవుతున్న నీటిలో నాణ్యత ఎంత అనేది ప్రశ్నార్థకమవుతోంది. వర్షాకాలం నేపథ్యంలో విధిగా తాగునీటి పరీక్షలు పెంచాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జిల్లాలో పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పైపులైన్ లీకేజీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు దాని వెంట అంటు వ్యాధులను తీసుకురావడం సాధారణమైపోయింది. ఈకాలంలో అందరూ తాగునీటి వనరుల నాణ్యతపై దృష్టి సారించాలి. ప్రస్తుతం జిల్లాలో మిషన్ భగీరథ పథకంతో పాటు స్థానిక సంస్థల ద్వారా చాలా గ్రామాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం శరవేగంగా సమాయత్తం కావాల్సి ఉంది. జలాశయాలు, ట్యాంకులు, నల్లాల వద్ద నీటి నమూనాలను సేకరించి తప్పనిసరిగా పరీక్షలు చేయాలి. నాణ్యత లోపించినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు అనేక చోట్ల ఏర్పాటుచేసిన ప్రజా కొళాయిలను గాలికి వదిలేస్తున్నారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా మరిచారు. ట్యాంకులు, మురికివాడల నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు. ముఖ్యంగా పాఠశాలల కుళాయిల్లో నీటిని పరీక్షించాలనే బాధ్యత అందరూ విస్మరించారు.
ముందుజాగ్రత్తలతో ఎంతో మేలు
గ్రామాల్లోని మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా దాని శాతం నీటిలో ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం క్లోరింగ్ పరీక్ష ఉపయోగపడుతుంది. అలాగే వర్షాకాలంలో పైపులైన్ లీకేజీల కారణంగా నీటిలో బ్యాక్టీరియా చేరినా క్లోరింగ్ చేస్తే అవి చనిపోతాయి. ఈ పరీక్షలను ఇంటి వద్ద వచ్చే కొళాయిల దగ్గర శిక్షణ పొందిన సిబ్బందితో పాటు కార్యదర్శికి ఇచ్చిన కిట్ ద్వారా నీటిని పరీక్షిస్తే క్లోరింగ్ శాతం ఉందో లేదో తేలిపోతుంది. అలాగే, గ్రామ పంచాయతీ సిబ్బందితో ఏటా నీటి నాణ్యత నిర్ధారణ పరీక్షలు, నీటి ట్యాంకులు తరచూ శుభ్రం చేయించడం, ఫిల్టర్ బెడ్ల గృహాల వద్ద ఉండే నల్లాల నుంచి నమూనాలు సేకరణ, లీకేజీలు ఉంటే మరమ్మతు చర్యలు, వానాకాలంలో ప్రతిరోజు క్లోరిన్ టెస్టు కిట్ల ద్వారా నాణ్యత స్థాయిని పరిశీలించాల్సి ఉంది.
కిట్లు ఉన్నా.. వినియోగించని వైనం
రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి శాఖ ద్వారా రూ.వేలు వెచ్చించి కిట్లను అందజేస్తోంది. అంతే కాకుండా పంచాయతీలోని తాగునీటి సిబ్బందికి వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందజేస్తోంది. కిట్లు అందజేయడం, శిక్షణ ఇవ్వడం బాగానే ఉన్నా వీటిని వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కిట్లను అందజేసినా ఎక్కడా పరీక్షించిన దాఖలాలు కనిపించలేదు. ఈసారి అలా కాకుండా ప్రతి బోరు నుంచి వచ్చే నీటితో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తరచుగా పరీక్షించి తాగడానికి పనికొస్తాయా లేదా అనే విషయాలపై పంచాయతీలు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పరీక్షల్లో నాణ్యత లేవని తేలితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇవ్వని పంచాయతీ తాగునీటి సిబ్బందికి వెంటనే శిక్షణ అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షాకాలంలో కలవర పెడుతున్న లీకేజీలు
మన్యంకొండ నుంచి జిల్లాకు వచ్చే ప్రధాన పైపులైన్కు తరచూ లీకేజీలు
జిల్లాలో 400 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా
జాడ లేని నీటి పరీక్ష కిట్లు.. జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం