
నిర్లక్ష్యమేలా..?
నారాయణపేట
శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025
కృష్ణాబేసిన్లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని..ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు.
– గద్వాల/అమరచింత
జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్గేట్లకు ఉన్న ఇనుప రోప్లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు.

నిర్లక్ష్యమేలా..?