
సమష్టి కృషితోనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం
నారాయణపేట: సమష్టి కృషితో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నారు. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే లభించే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారి మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించినట్లు గుర్తిస్తే 1908 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీసు శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. తర్వాత యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలే నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు, జిల్లా అధికారులు బహుమతులను అందజేశారు. అలాగే, ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏఎస్పీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఈఓ గోవిందరాజులు, ఆర్టీవో మేఘా గాంధీ, డీపీఆర్ఓ ఎం.ఏ. రషీద్ పాల్గొన్నారు.