
తెలంగాణలోనే మోడల్గా ఉర్దూ ఘర్
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణలోనే ఒక మోడల్గా మహబూబ్నగర్లోని ఉర్దూ ఘర్ నిలవనుందని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఉర్దూ ఘర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి షబ్బీర్అలీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్లో అధునాతనమైన ఉర్దూ ఘర్ నిర్మాణమవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటే చాలా కష్టమన్నారు. హిమాలయ పర్వతంలోని అంచువరకు ఎక్కొచ్చుగాని ప్రభుత్వం నుంచి డబ్బులు తేవడం కష్టమని, ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నానన్నారు. అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు, అందులో రూ.15 కోట్లతో ఉర్దూ ఘర్ నిర్మిస్తున్నందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి వరకు చాలా మంది మైనార్టీ విద్యార్థులు ఉర్దూ తీసుకోవడం లేదని, దీంతో కళాశాలల్లో ఉర్దూ చదివే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టడం చారిత్రాత్మకం అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఉర్దూలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ రోజు మహబూబ్నగర్ చరిత్రలో మరుపురాని రోజు అని, ఎన్నో ఏళ్ల నుంచి ఉర్దూ ఘర్ నిర్మించుకోవాలనే కల నెరవేరుతుందన్నారు. చదువును జీవితంలో భాగం చేసుకోవాలని, చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ ఉర్దూ ఘర్ మనలోని ఐక్యతకు చిహ్నం అన్నారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం సీఎంతో మాట్లాడి రూ.45 కోట్లు మంజూరు చేయించారన్నారు. రూ.5 కోట్లతో మౌలాలిగుట్టలో శ్మశాన వాటిక నిర్మిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి జహంగీర్పీర్ ఐటీఐ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆమేర్ అలీ ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబాని తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టిమిరిస్ చైర్మన్ ఫహిమోద్దీన్ ఖురేషి, మైనార్టీ గురుకులాల కార్యదర్శి షపీవుల్లా, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, అబ్దుల్ హాదీ, సిరాజ్ఖాద్రీ, సాదుల్లా, అజ్మత్అలీ, ఫయాజ్, తఖీయోద్దీన్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్అలీ షబ్బీర్