
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నారాయణపేట: దివ్యాంగుల వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారకశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలో ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మొక్కలు నాటి మాట్లాడారు. యువత దేశానికి వెన్నెముక వంటి వారని, మత్తు పదార్థాల బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, అందరూ చదువుకొని దేశభక్తిలో భాగం కావాలన్నారు. అదే విధంగా ఎస్పీ కార్యాలయంలో మొక్కలను ఎస్పీ యోగేష్ గౌతమ్ నాటి మాట్లాడారు. వారం రోజులు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు లభిస్తున్నట్లు తెలిస్తే పోలీస్ శాఖ వారికి తెలియజేయాలన్నారు.