
రెట్టింపు ధరలతో దిగాలు
అమాంతం పెరిగిన జీలుగ విత్తనాల ధర
● గతేడాది 30 కిలోల బస్తా రూ.1,116 ఉండగా.. నేడు రూ.2,137కు పెరిగిన వైనం
● 60 నుంచి 50 శాతానికి
పడిపోయిన రాయితీ
● కొనుగోలు చేసేందుకు రైతుల అనాసక్తి
● జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం
మరికల్: అధిక దిగుబడులు సాధిచేందుకు సాగు భూమిలో సారం ఉండాలి. ఇందుకు భూమికి బలం ఇచ్చేందుకు రసాయన ఎరువులకు బదులు పచ్చిరొట్ట వినియోగించాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈక్రమంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేది జీలుగ. జనుము ధరలు గతేడాది కన్నా రెట్టింపు ధరలు పెరగడంతో ఫర్టిలైజర్, సోసైటీ దగ్గర బోర్డులు దర్శనమిస్తుండటంతో రైతులు బెంబేతెత్తుతున్నారు. జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంది. జీలుగ ధరలు పెరగడంతో వాటిని కొనుగోలు చేసేందుకు రైతులు అనాసక్తి చూపుతున్నారు.
60 నుంచి 50 శాతానికి పడిపోయిన రాయితీ
ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సహకార సంఘాల్లో పంపిణీ చేసే జీలుగ విత్తనాలు గతేడాది వరకు 60 శాతం రాయితీతో అందజేస్తున్న విత్తనాలను ఈ ఏడాది నుంచి 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తోంది. ఒక్కో రైతుకు పాసు పుస్తకంపై రెండున్నర ఎకరాలకు జీలుగ–30 కిలోలు, జనుములు–40 కిలోల విత్తనాలు పంపిణీ చేస్తోంది. సహకార సంఘాల్లో ఎక్కువ చోట్లా పిల్లి పెసర విత్తనాల కొరత నెలకొంది. రాయితీ పోగా గతేడాది 30 కిలోల జీలుగ బస్తా ధర రూ.1,116 ఉండగా 40 కిలోల జనుము బస్తా ధర రూ. 1,448 పలికింది. పిల్లి పెసర 20 కిలోల బస్తా ధర రూ. 1,084 ఉంది. ఈ ఏడాది 30 కిలోల జీలుగ బస్తా ధర రూ. 2,137కు చేరుకుంది. 40 కిలోల జనుము బస్తా ధర 2,510కి పెరిగింది. గతేడాది రాయితీ 60 శాతం వర్తించగా ఈ సారి 50 శాతానికి పడిపోవటం గమనార్హం.
మండలానికి800 బస్తాల చొప్పున
వానాకాలం కింద సాగు చేసే వరి నేలలు సారవంతం కోసం మండలానికి 800 బస్తాల జీలుగ విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2 వేల బస్తాల జీలుగ విత్తనాలు తెప్పించారు. వరి సాగు అధికంగా ఉండే మండలాల్లో ఎక్కువగా పంపిణీ జరుగుతుంది. కానీ ప్రస్తుతం జీలుగ విత్తనాల ధరలు అమాంతం పెరగడం వల్ల రైతులు పెద్దగా వీటిని తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జీలుగ విత్తనాలు రోజుల తరబడి ఫర్టీలైజర్, సోసైటీల దగర అలాగే ఉన్నాయి. రైతులు జీలుగ విత్తనాలు తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా.. పెరిగిన ధరల కారణంగా రైతులు వాటి జోలికి వెళ్లడం లేదు.

రెట్టింపు ధరలతో దిగాలు