
మహిళల సమగ్రాభివృద్ధే ధ్యేయం
నారాయణపేట/నారాయణపేట రూరల్: మహిళల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్ లో సోమవారం నారాయణపేట మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని 450 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజలకు అవి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. పేద ప్రజలు పదేళ్లుగా కలలుకన్న సొంత ఇళ్ల నిర్మాణాలు నిజం చేసిందని అన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి చెందుతుందని, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఎంపీడీవో సుదర్శన్, ఎంపీఓ బాలాజీ, నాయకులు శరణప్ప, గౌస్, జనార్దన్ గౌడ్, శంకర్, వెంకటయ్య, మధుసూదన్ రెడ్డి, కోట్ల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.