
ప్రభుత్వ బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమావేశమై.. 2025–26 విద్యా సంవత్సరం బడిబాట, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, పాఠశాలల్లో సివిల్ వర్క్లు, శిథిలావస్థకు చేరిన పాఠశాలల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల తరగతి గదులకు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. కిచెన్ షెడ్, స్టోర్ రూం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంట ఏజెన్సీ వారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే తొలగించాలని సూచించారు. బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలని తెలిపారు. కడా పరిధిలోని నాలుగు మండలాలకు 313 కంప్యూటర్లు ఎఫ్ఎల్ఎన్ ఏఎక్స్ఎల్ కార్యక్రమం కోసం వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు, సీఎంఓసీ రాజేంద్రకుమార్, మిడ్ డే మిల్స్ సమన్వయకర్త యాదయ్యశెట్టి, ప్లానింగ్ కోఆర్డినేటర్ నాగర్జునరెడ్డి, జీఈసీఓ నర్మద ఉన్నారు.
● జిల్లా కేంద్రం సమీపంలోని మెడికల్ కాలేజీలోకి ఇటీవల మార్చిన జిల్లా జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించి.. వివిధ విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డు, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద పేర్ల నమోదు కోసం రోగులు అధికంగా ఉండటాన్ని చూసిన కలెక్టర్.. రోజుకు ఎంత మంది ఓపీ, ఇన్ పేషెంట్లు వస్తున్నారని కంప్యూటర్ ఆపరేటర్లను అడిగి తెలసుకున్నారు. ఈ నెల 1నుంచి నేటి వరకు 2వేల మందికి పైగా వైద్యసేవలు పొందినట్లు వివరించారు. రోగులు, వారి బంధువులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అనంతరం సిటీ స్కాన్ విభాగంతో పాటు ప్రసూతి విభాగం, చిన్నపిల్లల వార్డును పరిశీలించారు. మూడో అంతస్తులో ఉన్న నాలుగు ఆపరేషన్ థియేటర్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం చేపట్టిన భూమి చదును పనులు, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి..
మరికల్: భూ సమస్యల పరిష్కారం కోసం కోసం ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మరికల్ మండలంలోని మాధవరం, చిత్తనూర్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంకోటి, ఆర్ఐ సుధాకర్రెడ్డి, విజయ్కుమార్, మురళి పాల్గొన్నారు.