సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి

Jun 10 2025 3:18 AM | Updated on Jun 10 2025 3:44 AM

మక్తల్‌: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లో సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అ లాగే, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావును కలిశారు. ఆయన వెంట సతీమణి వాకిటి లలిత, కుమారులు ఉన్నారు.

ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

నారాయణపేట: జిల్లాలోని ప్రజాఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఎస్‌ఐలు, సీఐలకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ఈమేరకు మొత్తం 8 ఫిర్యాదులు అందగా.. వాటిని ఆయా స్టేషన్‌ సిబ్బందితో మాట్లాడి పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉంచరాదని ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

రేపు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రాక

నారాయణపేట: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సాయంత్రం 3 గంటలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల సమస్యల పరిష్కారంతో పాటు భూ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల సంఘాల నాయకులు తప్పని సరిగా హాజరై తమ సమస్యలపై కమిషన్‌కు విన్నవించాలని కలెక్టర్‌ కోరారు.

నీతి ఆయోగ్‌ సర్వేపై ఎన్యూమరేటర్లకు శిక్షణ

కోస్గి (మద్దూరు): కేంద్ర ప్రభుత్వంలో గ్రామాల్లో బీపీఎల్‌ కింద ఉన్న కుటుంబాలు, వికలాంగుల కుటుంబాలు, విద్యకు దూరంగా ఉన్న కుటుంబాలు, తదితర ఆంశాలపై నిర్వహించే నీతి అయోగ్‌ సర్వేను ఏ విధంగా చేయాలనేది పంచాయతీ కార్యదర్శులకు, ఆశ, అంగన్‌వాడీ, ఉపాధ్యాయులకు సోమవారం మద్దూరులోని రైతు వేదికలో నీతి అయోగ్‌ విషయ నిపుణుడు నరేష్‌ శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో వీరి శాతం ఎంత, వారి అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సర్వే అధారంగా తీసుకుంటారని తెలియజేశారు. ఈ సర్వే ఏ విధంగా నిర్వహించాలి, ఏఏ ఆంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే దానిపై వివరించారు.

పునరావాస పనుల్లో వేగం పెంచాలి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్‌ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్‌తండా, అంజనగిరి తండాకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్‌, ఎల్లూర్‌ నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు.

సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి  
1
1/2

సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి

సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి  
2
2/2

సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement