
నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
నారాయణపేట రూరల్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ కొనసాగుతాయి. పరీక్షల కోసం జిల్లా విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా పంపించింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 367 మంది హాజరుకానున్నారు. వీరిలో 228 బాలురు, 139 బాలికలు. అత్యధికంగా సైన్స్ లో 206, గణితంలో 178, ఇంగ్లీష్ లో 110 మంది ఫెయిల్ కాగా తెలుగు 72, సోషల్ 41, హిందీ 21మంది ఉన్నారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో ఒకే ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కేంద్రానికి సీఎస్ గా సత్యనారాయణ సింగ్, డిఓ గా అనిఫ్ ను నియమించారు. పరీక్షలకు 11మంది ఇన్విజిలేటర్స్ విధులునిర్వ హించనున్నారు.
18 మందికి పదోన్నతి
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 18 మంది కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా పదోన్నతి వచ్చిన హెడ్కానిస్టేబుళ్లను డీఐజీ అభినందించారు. హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన వారిలో సయ్యద్ యాసిన్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్, వెంకప్ప, వి.నాగరాజురెడ్డి, చెన్నకేశవులు, షాకీర్ ఖాన్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ఎండీ రియాజ్, బాలయ్య, వెంకట్నాయక్, పి.నాగరాజుగౌడ్, ఎండీ అక్బర్, నరేష్కుమార్, వెంకట్రెడ్డి, రాజారమేష్, కె.నాగరాజు, కె.విజయ్కుమార్ ఉన్నారు.
పోలీస్ పాత్ర కీలకం
మహబూబ్నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎంతో కీలకమని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జోగుళాంబ జోన్– 7 డీఐజీ కార్యాలయం ఎదుట డీఐజీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది కట్టుబడి పనిచేయాలన్నారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. పోలీసులు క్రమశిక్షణతో సేవలు అందిస్తూ ప్రజల అభి మానం గెలుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పీయూలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ల నియామకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్లను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం నియమించారు. ఈ మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఈశ్వర్కుమార్, రవీందర్రెడ్డిలను నియమిస్తూ.. ఉత్తర్వులను వారికి అందజేశారు.