
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
నారాయణపేట/మక్తల్/ఊట్కూర్/మాగనూర్/నర్వ: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నారాయణపేటలో 347 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందని, వెంటనే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, పదేళ్లుగా ప్రజలు ఇళ్లు, రేషన్కార్డుల కోసం ఎదురుచూశారని, ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇండ్లతో పాటు అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తుందన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్, ఊట్కూర్, మాగనూర్, నర్వలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. మరికొందరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని, ఇళ్ల నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసుకోవాలని అన్నారు. ఇళ్లు విడతల వారిగా అర్హులైన ప్రతీ ఒక్కరికి మంజూరు అవుతాయని ఎవరూ నిరాశ చెందకూడదన్నారు.