మీనాక్షితో ‘మహబూబ్‌నగర్‌’ ఎమ్మెల్యేల భేటీ | - | Sakshi
Sakshi News home page

మీనాక్షితో ‘మహబూబ్‌నగర్‌’ ఎమ్మెల్యేల భేటీ

May 30 2025 12:38 AM | Updated on May 30 2025 12:38 AM

మీనాక్షితో ‘మహబూబ్‌నగర్‌’ ఎమ్మెల్యేల భేటీ

మీనాక్షితో ‘మహబూబ్‌నగర్‌’ ఎమ్మెల్యేల భేటీ

సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు గురువారం కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిశారు. హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నటరాజన్‌ వారివారి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనుల వివరాలపై ఆరా తీశారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి చర్చ జరుగుతోందని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నియోజకవర్గంలోని సమస్యలు కావాల్సిన నిధుల వివరాలను వారి నుంచి సేకరించినట్లు తెలిసింది. మీనాక్షి నటరాజన్‌ను కలిసిన వారిలో కొడంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మినహా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌ నగర్‌, మక్తల్‌, నారాయణపేట ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌ రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి ఉన్నారు.

మంత్రుల లెక్కనే ఇవ్వాలి: అనిరుధ్‌రెడ్డి

మీనాక్షి నటరాజన్‌తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో మంత్రులకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధంగా అయితే అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారో.. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా నిధులు కేటాయించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు లేరని.. వారికి నిధుల కేటాయింపులో ఏ విధంగా అయితే ప్రాధాన్యం ఇస్తున్నారో.. తమకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలందరూ వెళ్లారు. ఈ క్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి సహచర ఎమ్మెల్యేలను తన వాహనంలో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లారు. ట్రిపుల్‌ ఐటీ కళాశాలను మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అసెంబ్లీ పరిధిలో అభివృద్ధిపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆరా

మంత్రులకు ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారో.. అలాగే మాకు ఇవ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యే విజ్ఞప్తి

ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement