
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ
నారాయణపేట రూరల్: ముందస్తుగా ముసురు వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దోమలతో వచ్చే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పంచాయతీరాజ్, నీటి సరఫరా, మున్సిపల్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గతేడాది జిల్లాలో నమోదైన డెంగీ కేసుల వివరాలు అడిగి తెలుసుకొని దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, శిథిలావస్థకు చేరిన పెద్ద భవనాలను కూల్చేందుకు యజమానులకు నోటీసులు జారీ చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ సీజనల్ వ్యాధులు, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శైలజ, డీపీఓ భిక్షపతి, డీఎల్పీఓ సుధాకర్, పుర కమిషనర్లు, వైద్యులు పాల్గొన్నారు.
ప్రణాళికలు సిద్ధం చేయండి..
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం మహబూబ్నగర్లో సమీక్ష నిర్వహించనున్నందున కావాల్సిన పూర్తి సమాచారాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించారు. వ్యవసాయ ప్రణాళిక, వరి ధాన్యం కొనుగోలు, భూ భారతి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.