
వన మహోత్సవానికి వేళాయె!
నారాయణపేట రూరల్: పచ్చదనం విస్తరింప చే యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. గత ప్రభు త్వం హరితహారం పేరుతో 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదో విడతలో వనమహోత్సవం పేరుతో దీన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది ఇప్పటికే నర్సరీలో మొక్కల పెంపకం చేపట్టగా అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈనెల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు.
పక్కాగా మొక్కల సంరక్షణ
సరైన సంరక్షణ లేకపోవడంతో గతంలో నాటిన మొక్కలు కొన్ని రోజులు అయ్యాక చనిపోయి అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయారు. ఈసారి నాటిన ప్రతి మొక్క బతికేలా సంబంధిత శాఖలు బాధ్యతలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. పంచాయ తీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో నాటిన మొక్కలలో తప్పనిసరిగా 85% మొక్కలు బతికేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీలది. దీంతో మొ క్కల సంరక్షణ పక్కాగా జరగనుందని తెలుస్తోంది.
ఆవాసాలను బట్టి పంపిణీ..
ఈసారి ఆవాసాలను బట్టి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి ఇంటి ఆవరణలో స్థలం ఉన్నచోట పూలు, పండ్ల మొక్కలు నాటించేందుకు సిద్ధమయ్యారు. కమ్యూనిటీ స్థలాల్లో కలపనిచ్చే మొక్కలు, ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాల్లో నీడనిచ్చే మొక్కలను పెట్టేందుకు సిద్ధమయ్యారు. రైతుల పొలాల గట్లు, రహదారులకు ఇరువైపుగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏటా తగ్గుతున్న లక్ష్యం
జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 280 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ చొప్పున మొత్తం అన్ని నర్సరీల్లో 13 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. గత ఏడాది మిగిలిన బ్యాగులకు సంబంధించి మరో 3.21 లక్షల మొక్కలను సైతం పెంచారు. నిర్వహణ కోసం అదనంగా మరో ఐదు లక్షలకు పైగా నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 8.6 లక్షల మొక్కలు వనమహోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 2023లో 44 లక్షల మొక్కలను నాటారు. తదుపరి ఏడాది 15 లక్షలు, ఆ తర్వాత 12 లక్షలు మొక్కల పెంపకం చేపట్టారు.
అందుబాటులోని మొక్కలు..
ముఖ్యంగా జిల్లాలోని గ్రామపంచాయతీ నర్సరీలలో టేకు, సుబాబుల్, వేప, కానుగ, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి రకాలను సిద్ధంగా ఉంచారు. వీటికి తోడు ఈత, తాటి మొక్కలు సైతం అందించనున్నారు. ఆయా మొక్కల పెంపకానికి పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించి వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ గ్రీన్ షర్ట్స్ వేసి ఎండల నుంచి సంరక్షించారు. ముందస్తుగా వర్షాలు పడడంతో మొక్కలు నాటే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం
జిల్లాలో 8.6 లక్షల
మొక్కలు నాటడమే లక్ష్యం
నర్సరీలో అందుబాటులో మొక్కలు..

వన మహోత్సవానికి వేళాయె!