
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
నారాయణపేట: జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. గతేడాది పట్టణ, పల్లె ప్రగతి పేరిట మొక్కలు నాటారని, ఈ వర్షాకాల ఆరంభంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ముఖ్యంగా అవెన్యూ ప్లాంటేషన్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, చిన్న చిన్న మొక్కలకు బదులు 5 ఫీట్ల పొడవు గల మొక్కలు నాటాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కోసం రోడ్లను గుర్తించాలని, ఎక్కువ పొడవు కోసం రోడ్లను గుర్తించాలన్నారు. నర్సరీలలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటిలో ఏఏ రకాలు పొడవైన మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడాలని, పట్టణ ప్రాంతాల్లోని లే అవుట్లలో గల పది శాతం ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది కోసం ప్రస్తుతం ఇచ్చిన లక్ష్యం కంటె అదనంగా 20 శాతం ఎక్కువ మొక్కలు ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ శైలేష్కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, మండలాల ఎంపిడీఓలు, ఎపిఓలు పాల్గొన్నారు.
జీరో సిస్టంను వినియోగించుకోవాలి
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖలు చేపట్టిన నిర్మాణాలకు బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, గ్రావెల్ కొనుగోలు చేయడం కోసం గనులు, భూగర్భ శాఖ ప్రవేశపెట్టిన జీరో పర్మిట్ సిస్టంను వినియోగించుకోవాలనిఅడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. కలెక్టరేట్లో ఈమేరకు సమీక్షించారు. గనుల భూగర్భ శాఖ జీరో పర్మిట్ సిస్టం ద్వారా ప్రభుత్వానికి చెల్లించే రెవెన్యూ లీకేజీని అరికట్టవచ్చని, అలాగే ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఖనిజాల కొనుగోలు సులభతరం అవుతుందని అన్నారు. జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ నిర్మాణాలలో ఉపయోగించే ఇసుక తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి బల్క్ అర్డర్ల ద్వారా ఇసుక కొనుగోలు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారని తెలిపారు.ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ ఇంజినీర్ శాఖలు చేపట్టిన నిర్మాణాలకు ఇసుక తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెలిపారు. సమావేశంలో గనులు, భూగర్భశాఖ సహయ సంచాలకులు సంజయ్కుమార్, డీఎస్పీ నల్లపు లింగయ్య, పీఆర్ఈఈ హిర్యానాయక్, హౌసింగ్ పిడి శంకర్ నాయక్, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మనందం, మిషన్ భగీరథ ఈఈ రంగరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనేమెరుగైన విద్య
కోస్గి: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని, నిష్టాతులైన ఉపాధ్యాయులు బోధిస్తారని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, పౌష్టికాహరం వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుందన్నారు. నాయకులు, మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ బడుల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ శంకర్నాయక్ పాల్గొన్నారు.