నారాయణపేట: నీటిని సృష్టించలేమని.. భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా భూగ ర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలకు నిర్వహించిన వర్క్షాప్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూగర్భ జలాల వెలికితీత నియమాలు, సంరక్షణ, స్థిరమైన నీటి నిర్వహణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిత్య జీవితంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని.. గృహ, వ్యవసాయ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు మితిమీరి నీటిని వినియోగించడం భూగర్భ జలమట్టం తగ్గిపోవడానికి కారణమన్నారు. నాటిన మొక్కలు సంరక్షించాలని, ప్రతి ఏటా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. గార్డెన్, గ్రీనరీ పెంపునకు కృషి చేసిన అధికారులకు అవార్డు అందించనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి భూగర్భ జలాల ప్రాధాన్యత, భూగర్భ, ఉపరితల జలాల వెలికితీత, జల సంరక్షణ, వృక్షాల రక్షణ, టీజీ వాల్టా చట్టం 2002 గురించి వివరించారు. భూగర్భ జలవనరులశాఖ డీడీ రమాదేవి నీటి నిర్వహణ, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ జలవనరుల దినోత్సవం–2025 బుక్లెట్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.