నారాయణపేట రూరల్: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ గోవిందరాజు సూచించారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీచర్లు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించి, మధ్యాహ్న భోజన నిర్వహణపై వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశలో టెన్త్ గేమ్ చేజర్ అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒత్తిడికి గురికాకుండా యోగ, ధ్యానం చేయాలన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ సరిపడా నిద్ర పోవాలన్నారు. సందేహాలను నివృత్తి చేసుకొని భయం లేకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను, ఇతర పరికరాలను కేంద్రంలోకి తీసుకొని వెళ్లరాదని సూచించారు. కార్యక్రమంలో హెచ్ ఎం భారతి, డీఎస్ఓ భాను ప్రకాష్, ఎండిఎం ఇంచార్జ్ యాదయ్య శెట్టి పాల్గొన్నారు.