నాణ్యతపై గొంతు విప్పండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యతపై గొంతు విప్పండి

Mar 15 2025 12:51 AM | Updated on Mar 15 2025 12:51 AM

నాణ్య

నాణ్యతపై గొంతు విప్పండి

నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

మనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్‌లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

– మహబూబ్‌నగర్‌ క్రైం

ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి

జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు

ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం

ఐదేళ్లుగా వినియోగదారుల ఫోరం కోర్టులో కేసుల వివరాలు

ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది

వినియోగదారులు ఎయిర్‌లైన్స్‌, మెడికల్‌, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, టెలికాం, పోస్టల్‌, విద్యుత్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్‌ఫండ్స్‌, వ్యవసాయం, కస్టమర్‌ గూడ్స్‌, కొరియర్‌ సర్వీస్‌, విద్యారంగం, నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది.

నమోదైన కేసులు

పెండింగ్‌

పరిష్కరించినవి

2020

85 84 1

2021

227 226 1

2022

96 90 6

2023

80 57 23

2024

101 29 72

● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్‌లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్‌లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది.

ఇదీ నేపథ్యం

వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన విని యోగదారుల కేసుల నమో దు చేసుకోవడం కోసం ప్రత్యే క భవనం ఉంది.

● వినియోగదారులఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు.

● ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్‌ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్‌ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్‌పార్టీ చేసి ఆర్డర్‌ వన్‌సైడ్‌ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్‌పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్‌ వేసుకోవాలి.

అవగాహనే అస్త్రం

మారిన చట్టం..

1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్‌గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్‌లైన్‌లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్‌లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు.

వినియోగదారుల్లో చైతన్యం రావాలి

జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ వస్తువులు, జీవిత బీమా, చిట్‌ఫండ్‌, ఫైనాన్స్‌లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్‌కు ఫోన్‌ చేయాలి.

– సృజన్‌కుమార్‌, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సూపరింటెండెంట్‌

నాణ్యతపై గొంతు విప్పండి 1
1/1

నాణ్యతపై గొంతు విప్పండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement