నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో 3888 మంది విద్యార్థులకుగాను 3762 మంది పరీక్షకు హాజరయ్యారు. 126మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3290 మందికి 3187 మంది, ఒకేషనల్లో 598 మందికి 575 మంది హాజరయ్యారు. జిల్లా కన్వీనర్ పేటలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
నారాయణపేట ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైందని డీఈఓ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వరకు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే, ఇంటర్ ప్రాక్టికల్స్ 26 నుంచి మే 3వ తేదీ వరకు ఉంటాయని, విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలని సూచించారు.
జిల్లా జడ్జిపై రాష్ట్ర బార్ కౌన్సిల్ విచారణ
నారాయణపేట: జిల్లా జడ్జి అబ్దుల్ రఫీపై చర్యలు తీసుకోవాలని పేట బార్ అసోసయేషన్ ఆధ్వర్యంలో గురువారం 6వ రోజు న్యాయవాదులు జిల్లా కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్పాల్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గిరిధర్రావు, మధుసూదన్రావు జిల్లా కోర్టుకు వచ్చి విచారణ జరిపారు. జిల్లా జడ్జి న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ కించపరుస్తున్నారని, కోర్టు సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, కోర్టు సామగ్రి కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు వారికి స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది నాగురావు నామాజీ, బార్ అసోసియేషన్ అద్యక్షుడు దామోదర్ గౌడ్, చెన్నారెడ్డి, నందు నామాజీ, బీంరెడ్డి పాల్గొన్నారు.
అలసందలు క్వింటాల్ రూ.7,072
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం అలసందలు క్వింటాల్కు గరిష్టం రూ.7,072, కనిష్టంగా రూ.6,982 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్ట, కనిష్టంగా రూ.5,680, వేరుశనగ గరిష్టం రూ.6,020, కనిష్టం రూ.4,110, జొన్నలు గరిష్టం రూ.4,640, కనిష్టం రూ.2,650, ఎర్ర కందులు గరిష్టం రూ.7,314, కనిష్టం రూ.6,339, తెల్ల కందులు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,650 ధరలు పలికాయి.
వేరుశనగ క్వింటాల్ రూ.6,989
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262 ధరలు లభించాయి.