నారాయణపేట టౌన్: అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకాన్ని ప్రకటించిందని, తాజాగా దీనిపై ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై పేట పుర పాలక సంఘం కార్యాలయంలో మంగళవారం డాక్యుమెంట్ రైటర్లకు, లైసెన్స్ ఇంజినీర్లు, సర్వేయర్లు, రియల్ ఎస్టేట్ వాపారులతో పుర కమిషనర్ భోగేశ్వర్లు అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపల్ పరిదిలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేసన్ జరిగితే మిగితా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయ దస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందన్నారు. సందేహాలకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాగా సమావేశంలో పలువురు రియల్ వ్యాపారులు సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కిరణ్కుమార్ నివృత్తి చేశారు.