ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం

Mar 3 2025 1:23 AM | Updated on Mar 3 2025 1:20 AM

నారాయణపేట రూరల్‌: పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి విశ్వాసం, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత పునాదులపై విజయ సాధనాన్ని నిర్మించుకోవాలని, విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఉన్న కొద్ది సమయాన్ని పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలో గల స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన పూసల్‌ పహాడ్‌ టాలెంట్‌ టెస్ట్‌ విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి ఇలాంటి టాలెంట్‌ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ శ్రద్ధ, ఏకాగ్రతను కలిగి పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్‌ పూర్తి కావడంతో రివిజన్పై దృష్టి సారించాలని, గ్రాండ్‌ టెస్ట్‌ లపై ఫోకస్‌ పెట్టాలని కోరారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని, మిత ఆహారాన్ని తీసుకోవాలని, యోగ, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా టాపర్లుగా నిలిచిన ముగ్గురు ప్రభుత్వ, మరో ముగ్గురు ప్రైవేటు విభాగాల్లోని విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు.

రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించాలి

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలో జిల్లాలోనూ విద్యారంగంలో బాలికలదే పై చేయిగా ఉందని అన్నారు. తల్లిదండ్రులు సైతం బాలిక విద్యను ప్రోత్సహించాలని, అన్ని విషయాల్లోనూ అమ్మాయిలకు తోడ్పాటున అందించాలని కోరారు. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం పూసల్‌ పహాడ్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాస్‌ చౌదరి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు సాంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలని, తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని, సెల్‌ ఫోన్‌, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విషయాల వారీగా సీనియర్‌ సబ్జెక్ట్‌ టీచర్లు మెలకువలను తెలియజేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, నిర్వాహకులు షేర్‌ పారిజాత, కృష్ణారెడ్డి, ఏఎంఓ విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అధికారి నాగార్జున్‌ రెడ్డి, ఏపీవో సురేష్‌, ఎంఈఓ బాలకిష్టప్ప, డీఎస్‌ఓ భాను ప్రకాష్‌, నరసింహ, రఘురామేశ్వర్‌, రాజేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

పరీక్షల వేళ స్పష్టమైన లక్ష్యంతోవిద్యార్థులు ముందుకు సాగాలి

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement