డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

Mar 2 2025 1:42 AM | Updated on Mar 2 2025 1:40 AM

నారాయణపేట: డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్‌ కోసం బాటలు వేసుకోవాలని డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఎన్‌ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో డీఎస్పీ, జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిరోధానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని నివారించాలని, డ్రగ్స్‌ విక్రయదారులు యువతనే లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు. మన పరిసరాలలో ఎవరైనా డ్రగ్స్‌ విక్రయిస్తున్నారని తెలిస్తే సామాజిక బాధ్యతగా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌ వినియోగిస్తే ఎలాంటి ప్రభావాలు చూపుతాయని, వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయని పీపీటీ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల సమాచారాన్ని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్‌ సమాచారం తెలిస్తే సెల్‌ఫోన్‌ నంబర్‌ 8712671111 లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1908 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్‌ కి సంబంధించిన అవగాహన వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించి, విద్యార్థులు, లెక్చరర్స్‌తో ప్రతిజ్ఞ చేయించారు.ఎకై ్సజ్‌ సీఐ అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ లు వెంకటేశ్వర్లు, సునిత, ఎకై ్సజ్‌ ఎస్సైలు పాల్గొన్నారు.

చింతపండు క్వింటాల్‌ రూ. 8,040

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శనివారం 19 క్వింటాళ్ల చింతపండు రాగా.. క్వింటాల్‌కు గరిష్టం రూ.8,040, కనిష్టం రూ.5,011 ధరలు పలికాయి. అలాగే, శనగలు 5 క్వింటాళ్లు రాగా.. గరిష్టం, కనిష్టం రూ.5,755, వేరుశనగ 104 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,160, కనిష్టం రూ.3,920, జొన్నలు 42 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.4,021, కనిష్టం రూ.3012, అలసందలు 10 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,671, కనిష్టం రూ.6,609, ఎర్ర కందులు 241 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,585, కనిష్టం రూ.5,329 ధర పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement