నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రం
● జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్
నంద్యాల: రైతులు తాము పండించిన పత్తిని గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు పట్టణంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాస్థాయి పత్తి కొనుగోలు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో పత్తి క్వింటా కనీస మద్దతు ధర రూ.7710 (పొట్టి పింజ రకం), రూ.8110 (పొడవు పింజరకం) ఉందన్నారు. పత్తిని నంద్యాల పట్టణంలోని మురారి పవన్ ఆగ్రో టెక్ జిన్నింగు మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకోవచ్చునన్నారు. రైతులు జిన్నింగు మిల్లుకు పత్తిని తీసుకొచ్చే ముందుగా రైతుసేవా కేంద్రంలో ఈ క్రాప్ రిజిస్ట్రేషన్, కపాస్ కిసాన్ అప్ లో స్లాట్ బుకింగ్ చేయించుకోవాలన్నారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి అబ్దుల్ రెహ్మాన్, మురారి జిన్నింగ్ మిల్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


