
ముగ్గురికి కారుణ్య నియామకాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద ముగ్గురికి ఉద్యోగాలు కల్పించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ సీ నాసరరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందించారు. పీఎండీ ఇంతియాజ్ను నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిషత్ కార్యాలయానికి, ఎం విద్యుల్లతను కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమకల్ జెడ్పీ హైస్కూల్కు, ఎస్ రిజ్వానాను నంద్యాల జిల్లా శిరివెళ్ల జెడ్పీ హైస్కూల్కు నియమిస్తూ ఉత్తర్వులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్రెడ్డి పాల్గొన్నారు.
చట్ట పరిధిలో న్యాయం చేయండి
నంద్యాల: ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకుండా చట్టపరిధిలో వారికి న్యాయం చేయాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి అడిషనల్ ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని, నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్లో 130 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పంపామన్నారు.
లెక్చరర్ పోస్టుల భర్తీకి
నేటి నుంచి పరీక్షలు
నంద్యాల(అర్బన్): పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి 15 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్ బేస్డ్ అబ్జెక్టివ్ పరీక్షలను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం ఐదు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు, మధ్యాహ్నం 2.30 గంటలనుంచి సాయంత్రం 5 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలోని పాణ్యం రాజీవ్గాంధీ మెమోరియల్ కళాశాల, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల, శ్రీనివాసనగర్లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాల, అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజూ పరీక్షలు జరుగుతాయి.
పది పీఏసీఎస్లకు
పాలకవర్గాల నియామకం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల పాలకమండళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో 5, నంద్యాల జిల్లాలో 5 సంఘాలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. చైర్మన్గా ఒకరు, సభ్యులుగా ఇద్దరు నియమితులయ్యారు. కర్నూలు జిల్లాలో కడిమెట్ల సొసైటీ చైర్మన్గా విరుపాక్షి రెడ్డి, మదిర (దామోదర్ చౌదరి), పెద్దతుంబలం (అన్వర్ బాషా), పెద్ద హరివణం (ఆదిశేషారెడ్డి), గోనెగండ్ల (ఎన్వీ రామాంజనేయులు), నంద్యాల జిల్లాలోని కానాల సొసైటీ చైర్మన్గా ప్రేమనాథ్ రెడ్డి, పోలూరు (చంద్రమౌలీశ్వర్ రెడ్డి), గడివేముల (సత్యనారాయణ రెడ్డి), గోస్పాడు (వీరసింహా రెడ్డి), దీబగుంట్ల సొసైటీ చైర్మన్గా ఓబుల్ రెడ్డి నియమితులయ్యారు.
గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి చర్యలు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 10వ తరగతి, సీనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు చిన్నటేకూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో హాజరు కావాలన్నారు. 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేపడతామన్నారు. బీఆర్ఏజీసీఈటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం అరికెరలో సీఈసీ (మిగిలిన సీట్లకు) చదివేందుకు ఆసక్తి కలిగిన జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ నెల 16న ఉదయం 9.30 గంటలకు చిన్నటేకూరు గురుకులంలోనే స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.