శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
కొండ నిండా భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రత్యేక సమయాల్లో స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల(న్యూటౌన్): స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు తమ అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు.
పచ్చ నేతల నల్ల మట్టి వ్యాపారం!
పగిడ్యాల: టీడీపీ నాయకులు నల్లమట్టి వ్యాపారానికి తెరశారు. ఈనెల 14న పాతూరు తిప్ప నుంచి గ్రావెల్ బింగను అక్రమంగా తరలిస్తున్న వైనాన్ని ‘పాతూరు తిప్ప కరిగిపోతోంది’ అనే శీర్షికన సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురిచింది. ఈ కథనంపై తహసీల్దార్ శివరాముడు స్పందించారు. అనుమతి లేకుండా గ్రావెల్, నల్లమట్టి తరలించరాదని ఆదేశాలు ఇచ్చారు. భూగర్భ శాఖ(మైనింగ్) అధికారులకు అర్జీ పెట్టుకోవాలని చెప్పారు. అయితే తహసీల్దార్ ఆదేశాలను పట్టించుకోకుండా టీడీపీ నాయకుడైన ఎంపీటీసీ సభ్యుడి కనుసన్నల్లో నల్లమట్టి వ్యాపారం సాగుతోంది. కృష్ణానది నీటి మునక భూముల్లో లభ్యమయ్యే నల్లమట్టిని చాలా లోతుకు తవ్వి ఒక ట్రిప్పును అవసరమైన రైతుల పొలాలకు రూ. 1,100ల ప్రకారం అమ్ముతున్నారు.
శ్రీశైలంలో 39.5 టీఎంసీలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో ఆదివారం సాయంత్రానికి 39.4936 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 818.20 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎగువ సుంకేసుల ప్రాజెక్ట్, లోకల్ క్యాచ్మెంట్ నుంచి 8,942 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. జలాశయం నుంచి భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పాదన అనంతరం 7,259 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 3.366 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 2 మీమీ వర్షం కురిసింది.

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ