
సీమ ప్రాజెక్ట్లపై నిర్లక్ష్యం వీడాలి
నంద్యాల(అర్బన్): పాలకులు రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్లపై నిర్లక్ష్యం వీడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన వార్షికోత్సవం సందర్భంగా సంగమేశ్వరం వద్ద ఈనెల 31న నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం నంద్యాల రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక విక్టోరియా రీడింగ్ రూంలో రైతుల సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమలో నిర్మించిన ప్రాజెక్టులు ఒక్కొక్కటి నిర్వీర్యమవుతున్నాయన్నారు. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ దెబ్బతినడం, అలగనూరు రిజర్వాయర్ కుంగిపోవడం, అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకు పోవడం, గోరుకల్లు రిజర్వాయర్ కట్ట దెబ్బతినడం, తుంగభద్ర డ్యాంకు భద్రత లేకపోవడం, గాలేరినగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు ఇంకా కొనసాగుతున్నా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సంగమేశ్వరంలో నిర్వహించే బహిరంగ సభలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల ని కోరారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన వాల్పోస్టర్లను రైతు సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు యూనస్, కార్యదర్శి నాగకుమార్, కొమ్మ శ్రీహరి, దండె సుధాకర్, నాగన్న, కరీంబాషా, మహబూబ్బాషా, శ్రీరాములు, అసదుల్లా, శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.