
4న మహానందిలో వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు
మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఈ నెల 4వ తేదీన వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ వేదపండితుడు రవిశంకర అవధాని, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా మహానంది రుద్రగుండం కోనేరులో స్నానమాచరించి భక్తుల పాపాలను పోగొడుతుందన్నారు. ఆ రోజు స్నానం చేయడం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరస్నానంతో సమానమన్నారు. వేడుకల్లో భాగంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంవత్సరాల ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ కోర్సులు, ఒక సంవత్సరం మెకానికల్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9703395091, 9440748448, 08524–286055లను సంప్రదించాలన్నారు.
నేటి నుంచి మహానందీశ్వరుడి నిరంతర దర్శనం
మహానంది: వేసవి సెలవుల దృష్ట్యా మహానంది ఆలయంలో నేటి నుంచి జూన్ 15 వరకు నిరంతర దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం నుంచి భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిరంతరంగా మహానందీశ్వరుడి దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దర్శనం కొనసాగుతోందన్నారు. తాజా నిర్ణయంతో జూన్ 15 వరకు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా దర్శన భాగ్యం లభిస్తుందన్నారు.
శ్రీశైలంలో భారీ వర్షం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భారీ ఈదురు గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి శ్రీశైలం రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం ధాటికి పలువురు భక్తులు వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఈదురు గాలులకు క్షేత్ర పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
హుండీ ఆదాయం రూ.1.14 కోట్లు
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 56 రోజులకు భక్తులు నగదు రూపంలో రూ.1,14,68,836 సమర్పించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్ తెలిపారు.

4న మహానందిలో వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు