
కలపరిలో జ్వరంతో వృద్ధురాలి మృతి
ఆస్పరి: జ్వరాలతో మంచం పట్టిన కలపరిలో ఓ వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో జ్వరపీడితుల రక్త నమూనాలు ల్యాబ్కు పంపగా చికున్గున్యాగా బయటపడింది. 26 మందిని పరీక్షించగా 10 మందికి చికున్ గున్యా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వెంకమ్మ (60) జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు క్రితం వెంకమ్మకు జ్వరంతో పాటు కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతండడంతో మొదట ఆర్ఎంపీతో వైద్యం చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో ఆమెను ఐదు రోజుల క్రితం కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ రూ. 3 లక్షలు ఖర్చు అయినా జ్వరం నయం కాకపోవడంతో కుటుంబీకులు రెండు రోజులు క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా కోలుకోలేక ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు వెంకమ్మ కుమారుడు గిడ్డయ్య తెలిపారు. వెంకమ్మకు భర్త వెంకటేష్, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కొనసాగుతున్న వైద్య శిబిరం
కలపరి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగింది. వైద్య శిబిరాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు, పత్తికొండ డీఎల్పీఓ వీరభద్రప్ప సదందర్శించి రోగులతో మాట్లాడారు. రక్త పరీక్షల ద్వారా చికెన్ గున్యా వ్యాధిగా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చికెన్ గున్యా సోకిన వారికి తలనొప్పి, వాంతులు, జ్వరం, వికారం, చేతి వేళ్లు, కాళ్లు నుంచి మొదలుకుని శరీరంలోని అన్ని కీళ్లు నొప్పితో బాధిస్తుందన్నారు. కీళ్ల నొప్పులు వల్ల సరిగా నిలబడలేని పరిస్థితి వస్తుందని, జ్వరం తగ్గినా నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయన్నారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగిస్తామని పత్తికొండ డీప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ రఘురామిరెడ్డి చెప్పారు. సోమవారం వైద్య శిబిరంలో 30 మందికి వైద్య చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశామని, అవసరమైన వారికి వైద్యం అందించాని డాక్టర దుర్గాబాయి తెలిపారు. వైద్య శిబిరంలో సర్పంచ్ సుధమ్మ, పంచాయతీ, వైద్య సిబ్బంది వెంకటేష్, విజయరాజు, పద్మావతి, శంకర్, ఖలీల్, శకుంతల రోగులకు సేవలు అందించారు.
కొనసాగుతున్న వైద్య శిబిరం
గ్రామాన్ని సందర్శించిన అధికారులు

కలపరిలో జ్వరంతో వృద్ధురాలి మృతి