
నేడు 2 వేల భక్తులతో విష్ణు సహస్రనామ పారాయణం
కర్నూలు కల్చరల్: గోదా గోకులంలో శ్రీరామాయణ మహాయజ్ఙం ముగింపు వేడుకల్లో భాగంగా శుక్రవారం 2 వేల మందితో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి తెలిపారు. గురువారం గోదా గోకులంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శత జయంతి వేడుకల సందర్భంగా నాలుగు రోజులు గా గోదాగోకులంలో శ్రీమద్రామాయణ మహా యజ్ఞం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. రఘునాఽథాచార్య తిరు నక్షత్ర పవిత్ర తిథి సందర్భంగా రామాయణంలోని అంశాలపై ప్రవచుకులచే ప్రసంగాలు ఇప్పించడం జరిగిందన్నారు. శుక్రవారం పలువురు జీయర్ స్వాములు, మఠాధిపతుల సమక్షంలో 2 వేల మందికి పైగా భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నామన్నారు. శ్రీమద్రామాయణ ప్రవచన యజ్ఞ సమన్వకర్త డాక్టర్ తొగట సురేష్బాబు, హిందీ అధ్యాపకురాలు పార్వతీ, తెలుగు ఉపాధ్యాయిని పసుపులేటి నీలిమ శ్రీమద్రామాయణం విశిష్టతపై ఉపన్యసించారు. సమావేశంలో ప్రయాగ్రాజ్ నుంచి రాఘవ ప్రసన్న జీయర్ స్వామీ, త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామీజీ, శ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామీజీ, గోదా గోకులం వ్యవస్థాప అధ్యక్షులు మారం నాగరాజు గుప్తు, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.