ఉపాధికి ప్రణాళికలు
ఈ సారైనా పూర్తిస్థాయిలో
పని కల్పిస్తుందా..
నల్లగొండ : ఉపాధి హామీ పథకంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే సంవత్సరంలో ఉపాధి హామీ కింద చేపట్టనున్న పనులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ సభలు నిర్వహించి చేపట్టాల్సిన పనులను గుర్తించి గ్రామసభల తీర్మానం మేరకు పనులను ఖరారు చేస్తారు. దానికి అనుగునంగానే ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది.
ఈ నెలాఖరులోగా పనుల గుర్తింపు..
ఉపాధి హామీలో వచ్చే సంవత్సరం చేపట్టాల్సిన పనుల గుర్తింపు ప్రక్రియ అక్టోబర్ 2న ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు గ్రామసభల్లో తీర్మానం చేసి గుర్తించిన పనుల జాబితాను బ్లాక్ పంచాయతీకి పంపిస్తారు. అక్కడ వాటన్నింటిని పరిశీలించి డిసెంబరు 20వ తేదీలోగా ప్రాజెక్టు కోఆర్డినేటర్, కలెక్టర్లకు పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా మంత్రికి, తిరిగి కలెక్టర్ ద్వారా 2026 జనవరి 21లోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఆ శాఖ అధికారులు వాటిపై చర్చించి కేంద్రానికి పంపిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆమోదంతో మార్చి చివరి నుంచే కొత్త పనులను చేపట్టేందుకు అనుమతులు వస్తాయి.
గత సంవత్సరం పని దినాలు కదింపు
జిల్లాలో మొత్తం 3.5 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. వాటి పరిధిలో 7.46 లక్షల మంది మంది ఉపాధి పనులు చేస్తున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పని దినాలను కుదించింది. జిల్లాలో 82 లక్షల పని దినాలను చేపట్టాలని నిర్ణయించగా కేవలం 38 లక్షల పని దినాలు చేపట్టారు. రూ.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేంద్రం నుంచి రూ.6 కోట్లే విడుదలయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు వలస వెళ్లకుండా గ్రామంలోనే పని కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తోంది. గత సంవత్సరం సగానికి ఎక్కువగానే పని దినాలను కుదించింది. ఈసారి కూలీలకు 82 లక్షల పని దినాలను కల్పించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించి గ్రామసభలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈసారైన కూలీలకు పూర్తిస్థాయిలో పని కల్పిస్తుందో లేదో.. వేచి చూడాల్సిందే.
ఫ 2026–27లో చేపట్టాల్సిన పనులు ఖరారు
ఫ 30వ తేదీలోగా గ్రామసభల్లో తీర్మానాలు
ఫ 82 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం


