నాగర్కర్నూల్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ విమర్శించారు. బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నులను పెద్దఎత్తున వసూలు చేసుకోవడంతో పాటు, ఇక్కడి సంపదను ఇతర ప్రాంతాలకు తరలిస్తోందన్నారు. అయితే నియోజకవర్గ స్థానాల పెంపు విషయం వచ్చినప్పుడు మాత్రం ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేయడానికి కుట్రలు పన్నుతుందన్నారు. ఏకపక్షంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం అన్యాయం జరిగినా రాజకీయాలకు అతీతంగా ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దేశ భవిష్యత్కు మంచిది కాదన్నారు. నియోజకవర్గ స్థానాల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ప్రజా ఉద్యమాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్.ఆనంజీ, మారేడు శివశంకర్, గురప్రు కుర్మయ్య, కొత్త రామస్వామి తదితరులు ఉన్నారు.


