ఎస్ఎస్ తాడ్వాయి: విభిన్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదిమ తెగల ప్రజలకు ప్రస్తుతం చేపట్టిన జనగణన సర్వేలో ప్రత్యేకమైన రిలీజియన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు సంస్కృతీ పరిరక్షణకు ఈ నెల 13న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో మేధావులతో ఏర్పాటు చేయనున్న సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివా రం మేడారంలోని సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సంస్కృతితో ఆదిమ తెగలకు సంబంధం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఆదిమ తెగలకు సంబంధించిన ప్రజలు సుమారుగా 12లక్షల మంది ఉన్నారని తెలిపారు. వారికి ఇప్పటి వరకు ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ప్రత్యేక రిలీజియన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ పొడుగు శ్రీనాథ్, రాష్ట్ర కన్వీనర్ పాయం సత్యనారాయణ, మడవి నర్సింగారావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పొదెం కృష్ణప్రసాద్, డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర


