ములుగు రూరల్: పల్లెల్లో వేసవి శిబిరాల సందడి నెలకొంది. ఈ ఎండాకాలం సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. గ్రామ స్థాయిలో క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహణ ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం పెరగడంతో పాటు స్నేహభావం పెంపొందుతుంది. ప్రభుత్వం యువజన సర్వీస్ల క్రీడల శాఖ ఆధ్వర్యంలో శిబిరాలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు వేసవి సె లవుల్లో క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకొని ఆసక్తి కలిగిన క్రీడాల్లో రాణించే విధంగా కోచ్లను కూడా ఏర్పాటు చేసి శిబిరాలను నిర్వహిస్తుంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో..
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 10 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. శిబిరాల్లో 8 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగి బాలబాలికలు అర్హులు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారు.
ఏఏ క్రీడాంశాలల్లో శిక్షణ ఇస్తారంటే..
సైక్లింగ్, ప్లోర్బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో, తైక్వాండో, వాలీబాల్, కరాటే, రెజ్లింగ్
ఎక్కడెక్కడంటే..
ములుగులో క్రికెట్, కబడ్డ్డీ, ఏటూరునాగారం కబడ్డ్డీ, మదనపల్లిలో సైక్లింగ్, జగ్గన్నపేటలో రెజ్లింగ్, యోగా, వాజేడులో వాలీబాల్, ఏటూరునాగారం హ్యాండ్బాల్, ఆకులవారి ఘణపూర్లో అథ్లెటిక్స్ శిబిరాలను కొనసాగిస్తారు.
కోచ్ల ఎంపిక పూర్తి
జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వాహనకు కలెక్టర్ ఆదేశాల మేరకు కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వేసవి క్రీడా శిబిరాల నిర్వాహనకు యువజన సర్వీస్లు క్రీడల శాఖకు రూ.1.05 లక్షలను కేటాయించింది. ఇందులో కోచ్లకు రూ. 40 వేలు, క్రీడ సామగ్రి కొనుగోలుకు రూ.50 వేలు, మైదానం అభివృద్ధి, శిక్షణ శిబిరం నిర్వాహనకు 10 వేలు, క్రీడల సమయంలో ప్రమాదం జరగడం, చిన్న చిన్న గాయాలైన వెంటనే చికిత్స అందించేందుకు రూ.5 వేలను కేటాయించింది. శిబిరాల్లో కోచింగ్ ఇచ్చే వారికి నెలకు రూ.4 వేల గౌరవ వేతనం అందించనున్నారు. శిబిరం నిర్వాహనకు రూ.వెయ్యి చెల్లిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో వివిధ క్రీడలకు సంబంధించిన 10 శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. శిక్షణ ఇచ్చేందుకు కోచ్ల ఎంపిక పూర్తి చేశాం. మే 1 నుంచి 31వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన 14 సంవత్సరాల వయసులోపు బాలబాలికలు అర్హులు. జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– రామ్మోహన్,
జిల్లా యువజన క్రీడల అధికారి
మే 31వ తేదీ వరకు కొనసాగింపు
జిల్లాలో 10 శిబిరాల ఏర్పాటు
ఒక్కో శిబిరంలో 20 నుంచి 25 మంది విద్యార్థులు
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా యువజన క్రీడల అధికారి
రామ్మోహన్


