జిల్లాలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత
ములుగు: పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంధనం వస్తుందని తెలియగానే బంకుల వద్దకు రాత్రి, పగలు తేడా లేకుండా వెళ్లి క్యూలు కడుతున్నారు. జిల్లాలో మంగళవారం 5 పెట్రోల్ బంక్లకు ఇంధనం రాగా గంటల వ్యవధిలోనే అమ్మకాలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కొనసాగాయి.
దొరకదనే ప్రచారంతో ఆందోళన
ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ దొరకదనే ప్రచారంతోనే వాహనదారులు ఆందోళనకు గురవుతుండడంతో ఇంధనం కొరత మరింత తీవ్రమైంది. ఇంధనం దొరకదనే నెపంతో వాహనదారులు ఫుల్ ట్యాంక్ నింపుకోవడమే కాకుండా క్యాన్లలో ఇంధనాన్ని తీసుకొని వెళ్తూ స్టాక్ చేసుకుంటున్నారు. దీంతో వాహనాలు నడిపి జీవించే ఆటోవాలాలు, జీపు యజమానులు, అద్దెకార్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 39 పెట్రోల్ బంక్లు ఉండగా పలు బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కొరత లేదని ఒకవైపు అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంధనాన్ని ప్రతిరోజూ సరఫరా చేసే చమురు కంపెనీలు వారం నుంచి రెండు వారాల సమయం తీసుకొని ట్యాంకర్లను పంపిస్తుండడంతో సమస్య తలెత్తుతుందని బంకుల యజమానులు పేర్కొంటున్నారు.
వాహనదారులకు తప్పని కష్టాలు
రాత్రి, పగలు తేడా లేకుండా క్యూలు
కొరత లేదంటున్న అధికారులు


