ప్రపంచ ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే సహజ సిద్ధ అడవులు దగ్ధం అవుతున్నాయి. అయినా అటవిశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు. అధికారుల తీరు చూస్తుంటే భవిష్యత్లో అడవులు అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుందని వనప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లూరుగుట్టపై ఔషధ గుణాలు కలిగిన వేలాది రకాల అరుదైన వృక్షసంపద ఉన్నట్లుగా 15 ఏళ్ల క్రితం అటవిశాఖ గుర్తించింది. దీంతో మెడిసినల్ ప్లాంట్ ఏర్పాటు చేసి నిధులు రాకపోవడంతో వదిలేశారు. అగ్నికీలలతో విలువైన వృక్షజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.


