ములుగు రూరల్: నేడు(ఆదివారం) జిల్లా కేంద్రంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలిన కోరారు.
రామప్పలో దూరదర్శన్
డైరెక్టర్ జనరల్ ఇంజనీర్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ (డీడీజీఈ ఢిల్లీ) అభిషేక్ అగర్వాల్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్ శాలువాతో సన్మానించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట హైదరాబాద్ దూరదర్శన్ డైరెక్టర్ వెంకటరమణ, టూరిజం అధికారులు ఉన్నారు.
డీఎన్టీ పాఠశాలకు ప్రత్యేక అనుమతులు
ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలకు ప్రత్యేక అనుమతులు వచ్చినట్లు స్వచ్ఛంద గ్రంథాలయ నిర్వహకుడు దుపాటి సతీశ్ తెలిపారు. చిన్నబోయినపల్లి డీఎన్టీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ప్రీ–ప్రైమరీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి పాఠశాల పరిస్థితి వివరించగా వారు వెంటనే సానుకూలంగా స్పందించి డీఈఓకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూల్ స్థాయికి డీఎన్టీ పాఠశాలను అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. గతంలో లాగానే మన చుట్టూ పక్కల గ్రామాలకు వచ్చే ప్రైవేటు బస్సులను రానివ్వకుండా, మన పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి పిల్లలను ఏటూరునాగారం, కమలాపురం లాంటి దూర ప్రాంతాలకు పంపొద్దని వివరించారు. మన ఊరి బడిలోనే ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్య, ప్రభుత్వ సదుపాయాలు ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు.
30న కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గ సమావేశం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు(పాలకవర్గం) మొదటి సమావేశాన్ని ఈనెల 30న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ అవధాని మోహన్శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.
28న బహిరంగ వేలం
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన మడ్తపల్లి గ్రామంలోని దేవస్థానం భూముల కౌలుకు బహిరంగ వేలం ఈనెల 28న మంగళవారం నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.


