వెంకటాపురం(కె):మండలకేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీక్లీనర్లు నిరుపయోగంగా మారాయి. వివరాలిలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి దుమారానికి విద్యుత్ లైన్లు చుట్టుకుపోయి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తీసుకువచ్చిన ప్యాడీ క్లీనర్లు నిరుపయోగంగా మారాయి. దీంతో రైతులు ప్రైవేట్ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను ఉపయోగించుకుంటున్నారు. ఒక ట్రక్కు ధాన్యం తూర్పార పోసినందుకు సుమారు రూ.650 వరకు చెల్లించాల్సి వస్తుందని, తమపై ఆర్థికభారం పడుతుందని రైతులు వాపోతున్నారు. యార్డులో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సమయాల్లో పశువులు, దొంగలు వచ్చినా కనబడే పరిస్థితి లేదన్నారు. అలాగే కొనుగోలు కేంద్రంలో ప్లాస్టిక్ డ్రమ్ములో తాగునీరు పట్టడంతో ఎండకు ఎండుతూ తాగేందుకు వీలు లేకుండా పోతుందన్నారు. ఇక మరుగుదొడ్లు అయితే పిచ్చి మొక్కలతో నిండి వాడుకునేందుకు వీలులేకుండా పోయిందన్నారు. మరుగుదొడ్లలో మొలిచిన చెట్లను తొలగించి ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రంలో
విద్యుత్ అంతరాయం
ఇబ్బందులు పడుతున్న రైతులు


