
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
ములుగు రూరల్: ఎస్ఎస్జీ సర్వేకు సంబంధించి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందేందుకు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు వందశాతం మరుగుదొడ్లు వినియోగించుకునేలా కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ముందుగా స్వచ్ఛ సర్వేక్షన్ –2025 వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎస్ఎస్జీలో 1000 మార్కులకు 540 మార్కులు సాధించడానికి ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజలు సంచరించే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంకుడుగుంతల ఏర్పాటు పై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఎస్ఎస్జీ –2025 సర్వేతో జిల్లాకు ర్యాకింగ్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి అవార్డు పొందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, డిప్యూటీ సీఈఓ రాజు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర ప్రత్యేక టూర్ పోస్టర్ను వరంగల్ –2 డిపో మేనేజర్ జ్యోత్స్నతో కలిసి కలెక్టరేట్లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూట్ –1లో రామప్ప, బొగత జలపాతం, మల్లూరును ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్లి సందర్శించేందుకు ఒక్కొక్కరికి రూ.530, రూట్ –2 ప్రసిద్ధి శివక్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట సందర్శనకు ఒక్కొక్కరికి రూ.2,300లతో రెండు రోజులు భక్తుల సౌకర్యాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 27వ తేదీన హనుమకొండ నుంచి పంచరామాల యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ అధికారి రాజ్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమృద్ధిగా ఎరువుల అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. 1.25లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంటసాగు విస్తీర్ణం లక్ష్యంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారం చూపాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలోని 9మండలాల్లో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మొదటి విడతలో 754, రెండో విడతలో 3,827 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 400 మంది లబ్ధిదారులకు రూ.1లక్ష చొప్పున ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టినట్లు వివరించారు. పారిశుద్ధ్య నివారణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఏఓ సురేష్, డీసీఎస్ఓ ఫైజల్ హుస్సేనీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, డీఎంహెచ్ఓ గోపాల్రావు, హౌసింగ్ పీడీ సూర్యనారాయణ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి