ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా
ఏటూరునాగారం: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సమస్యలపై ఐటీడీఏ సెక్టార్ అధికారులు దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్భార్లో దరఖాస్తులు స్వీకరించారు. జయశంకర్ జిల్లా మహాముత్తారం బొగ్గుపల్లి గ్రామంలో బోర్లు చేశామని, వాటికి విద్యుత్ అమర్చాలని 14 మంది రైతులు కోరారు. ఆదివాసీ సంఘాల్లో అర్హులైన సభ్యులకు, గోవిందరావుపేట మండలం ముంపునకు గురైన ప్రాజెక్టునగర్ వాసులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోరారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని, ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేయాలని గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు కొత్త సురేందర్, జిల్లా నాయకులు గండెపల్లి సత్యం విన్నవించారు. సోలార్ వీధిలైట్లు ఇప్పించాలని అందుగులమీది గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. కాగా గిరిజన దర్భార్లో వచ్చిన 41 వినతులను ఆయా సెక్టార్ అధికారుల ద్వారా పరిష్కారం చూపేవిధంగా చర్య తీసుకుంటామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.