
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ సంకీర్త్
ఏటూరునాగారం: విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం వీడ్కోల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు నేర్చుకోవాలన్నారు. లక్ష్యం ఏర్పాటు చేసుకుని, లక్ష్యసాధన దిశగా కష్టపడి చదవాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి 10/10 సాధించాలన్నారు. తాను కూడా ప్రణాళికతో చదివి అధికారి అయ్యాయని సూచించారు. సెల్ఫోన్లకు అలవాటు పడకుండా చదువుపై దృష్టి పెట్టాలన్నారు. జూదం, తాగుడు, ప్రేమ కేసుల్లో చిక్కితే ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తునికి వెంకటేశ్వరరాజు, వైస్ ప్రిన్సిపాల్ సునిత, డిప్యూటీ వార్డెన్ సునిత, సర్దార్సింగ్, రమేష్, రాజు పాల్గొన్నారు.