అమ్మ పేరుతో పేదలకు రుచికరమైన భోజనం: రాఘవ లారెన్స్ | Raghava Lawrence Launches 'Kanmani Annadhana Virundhu' to Feed the Poor with Quality Food | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: పేద పిల్లలకు విందు భోజనం.. రాఘవ లారెన్స్ వినూత్న కార్యక్రమం

Sep 18 2025 3:40 PM | Updated on Sep 18 2025 4:17 PM

Raghava Lawrence Started Special Meals Programme for poor children

కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ స్టైలే వేరు.. అది సినిమాల్లో మాత్రమే కాదు.. నిజ జీవితంలోనూ ఆయన అంతే. అందరు హీరోలకు భిన్నంగా సమాజ సేవలో చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరు పేదల శ్రేయస్సే లక్ష్యంగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రైతులు, విద్యార్థులు, దివ్యాంగులు ఇలా ఎందరినో ఆదుకున్న రాఘవ లారెన్స్.. తాజాగా మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పేదలకు రుచికరమైన భోజనం అందించేందుకు తన తల్లి పేరు మీద 'కణ్మణి అన్నదాన విందు' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధనవంతులు తినే నాణ్యమైన భోజనాన్ని పేదలకు అందించనున్నారు. నిరుపేద చిన్నారుల్లో చిరునవ్వులు చిందించడమే తన లక్ష్యమని రాఘవ లారెన్స్ ట్వీట్ చేశారు.

రాఘవ లారెన్స్ తన ట్వీట్లో రాస్తూ.. 'కన్మణి అన్నదాన విరుందు ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు నా హృదయానికి దగ్గరగా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించా. కార్యక్రమానికి కన్మణి అన్నదాన విరుందు అని నా తల్లి పేరుతోనే పెట్టాం. ధనవంతులు మాత్రమే ఆస్వాదించే ఆహారాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడని వారికి అందుబాటులో ఉంచడమే తన ప్రోగ్రామ్ లక్ష్యం. ఆహారం ఒక ప్రత్యేక హక్కుగా ఉండకూడదు.. అది ప్రతి హృదయానికి చిరునవ్వులు తెచ్చే ఆనందంగా ఉండాలి. పిల్లలు, పెద్దలతో కలిసి నారి కురవర్గల్ సంఘంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు వివిధ రకాల ఆహారాన్ని ఆస్వాదించినప్పుడు వారి కళ్లలో ఆనందాన్ని చూసి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో, అందరి ఆకలిని తీర్చే ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని నేను ఆశిస్తున్నా' అని తన ఆనందాన్ని పంచుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement