● జిల్లావ్యాప్తంగా 1.6 లక్షల మందికే సాయం
● ఏటేటా తగ్గుతున్న లబ్ధిదారులు
● ఏడేళ్లుగా కొత్త రైతుల ఎదురుచూపు
మెదక్జోన్: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో జిల్లాలో కొంతమందికే ప్రయోజనం చేకూరుతోంది. 2019 జనవరి 31 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఏటా మూడు విడతల్లో కలిపి రూ. 6 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి ఈ పథకంలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. వారిలో మృతిచెందిన రైతుల పేర్లను తొలగిస్తున్నారు. కానీ కొత్త వారి పేర్లు నమోదు చేయకపోవటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద అందరూ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అలాగే కొత్త రైతులకు అవకాశం కల్పిస్తున్నారు. కేంద్ర పథకంలో ఆ అవకాశం లేక ఎందరో కర్షకులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.
35 శాతానికే పరిమితం
జిల్లాలో ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 3,02,741 రైతులు ఉండగా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కేవలం 1,06,915 మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించారు. ఈ లెక్కన ఇంకా 1,95,826 మందికి నిధులు అందడం లేదు. అంటే ఇంకా సగానికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరడం లేదు. కాగా, గత నెలలో విడుదల చేసిన 23వ విడతకు సంబంధించి జిల్లాలో రూ. 22 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి.


