అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ప్రతిభావంతులైన విద్యార్థుల అపూర్వ మేధాశక్తి వెలకట్టలేనిదని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. తూప్రాన్ గీతా స్కూల్ విద్యార్థులు మహతి, కృతిక, రాజేశ్, అశీష్ సంయుక్తంగా 3 ప్రాజెక్ట్లు రూపొందించారు. వికసిత్ భారత్ బిల్డదాన్–2025 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమంగా నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వారిని అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి వీరు తయారు చేసిన ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపిక కావడం హర్షనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మిగితా విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ రాజు, సుదర్శనమూర్తి, రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం రబీ, యాసంగి 2022–23 సీజన్కు సంబంధించిన టెండర్ ధాన్యం అంశంపై రైస్మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు.


