
చివరి గింజ వరకు కొంటాం
చిన్నశంకరంపేట(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేదిలేదని కలెక్టర్ రాహుల్రాజ్ హెచ్చరించారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్, గవ్వలపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాంటా చేస్తున్న తీరు, ధాన్యం తేమ శాతం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు పాల్పడినా, ధాన్యం ఎక్కువ కాంటా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 71 రైస్మిల్లులకు ధాన్యం పంపించామని ఆయన వివరించారు. ధాన్యం నిల్వలకు అవసరమైతే ప్రభుత్వం గోదాంలను కేటాయిస్తుందని చెప్పారు. రైస్మిల్లుల వద్ద ఆన్లోడ్ కోసం రెవెన్యూ అధికారిని కేటాయించామని చెప్పారు. ధాన్యం రైస్మిల్లుకు చేరిన 48 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు జయ చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మన్నన్, ఐకేపీ ఏపీఎం లక్ష్మినారాయణ ఉన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచండి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి తన చాంబర్ నుంచి జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి ఎద్దడి నివారణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అధికారులతో వెరిఫికేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరలో అర్హత గల లబ్ధిదారులకు మంజూరు చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట ప్రణాళిక ద్వారా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించం
కలెక్టర్ రాహుల్రాజ్